Sunday, April 27, 2008

పత్రికల అంతర్యుద్దం


సాక్షి రంగప్రవేశంతో తెలుగు దిన పత్రికల మధ్య పోరాటం ప్రారంభమైంది. అది సర్క్యులేషన్లోనో, వార్తల కవరేజీలోనో కాదు. పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంలోనే ఈ పోరాటం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పోటీగా అత్యాధునిక టెక్నాలజీ, అన్ని పేజీలు రంగుల్లో, ఒకేసారి 23 ఎడిషన్లతో వచ్చిన సాక్షి సరికొత్త చరిత్ర సృష్టించిందనడంలో అనుమానం లేదు. అయితే ఈనాడులో వచ్చిన స్టోరీ(జడ్చర్ల ఎస్.ఇ.జడ్)ని సాక్షి సమీక్షించడం, సాక్షిపై ఈనాడు ఎదురు తిరగడం పాఠకులను ఆశ్చర్యపరిచింది. ఈనాడులో వచ్చిన స్టోరీ అసత్యమైతే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సాక్షి ఎందుకు జోక్యం చేసుకున్నట్లు? అలాగే తాను అమ్ముతున్నట్లుగానే ఇతర తెలుగు దిన పత్రికలు కూడా రూ.2/-కే అమ్మాలని సాక్షి డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబు. ఎవరి సరుకుకు వారు ధర నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారు. తాను అమ్మే ధరకే ఇతరులూ అమ్మాలని ఏ వ్యాపారి కూడా శాసించజాలడు. ఏ ధరకు ఏ సరుకు కొనాలో నిర్ణయించుకునేది వినియోగదారుడే. ఈ సూత్రం పత్రికలకూ, పాఠకులకూ వర్తిస్తుంది. అంతర్జాతీయ టెక్నాలజీతో, అన్ని పేజీలు రంగుల్లో కేవల రూ.2/- కే ఇస్తున్న సాక్షితో ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీపడలేవని అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఆ రెండు దిన పత్రికలే అంగీకరించాయి. ఎలాగు సాక్షి సర్క్యులేషన్ 13 లక్షలు దాటింది. యుద్దమొలో గెలిసిన తర్వాత కూడా శత్రువుని హింసించాలా?.. క్షమించి వదిలేయవచ్చుకదా?..