Thursday, November 13, 2008

జెమినిలో ఏం జరుగుతోంది?

బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నరనే వార్తలు జెమిని న్యూస్ ఉద్యోగుల్లో కల కలాన్ని సృష్టిస్తున్నాయి. ఇది నిజమా.. వదంతా అర్ధంకాక అక్కడి జర్నలిస్టులు భయపడుతున్నారు. స్థానిక యాజమాన్యం సైతం అక్కడి ఉద్యోగులకు వాస్తవాలు చెప్పకుండా దాతోంది. జీతాలు పెంచుతామనే బూటకపు హామీలతో ఇతర ఛనెళ్ళలో ఆఫర్లు వదులుకొని అక్కడే కొనసాగుతున్న జర్నలిస్టులకు కంటినిండా నిద్ర కూడా కరువైంది. పాతవారికి జీతాలు పెంచకపోగా కొత్తవారిని వారికన్న ఎక్కువ జీతాలకు తీసుకోవడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. జెమిని న్యూస్ ను ఔట్ సోర్సింగ్ కి ఇవ్వడలో భాగం గానే ప్రస్తుత ఉద్యోగుల వద్ద రాజీనామా లేఖలు తీకుంటున్నరని, వీరందరిని వేరే సంస్థ ఉద్యోగులుగా చూపించి ఇంక్రిమెంట్లు, బోనస్లు ఎగ్గొట్టాలన్నదే సన్ యాజమాన్య ఎత్తుగడ అని భావిస్తున్నారు. ఇటీవల ఛానెల్ను ఔట్ సోర్సింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి భంగ పడ్డ తర్వాత ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని సంతోషించిన జెమిని ఉద్యోగులు తాజా పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నారు.

బ్యూరో చీఫ్ పీఠం అధిష్టించిన మోనార్క్

అతనో మోనార్క్.. తానేదో గ్రహం నుండి ఊడి పడ్డ మానవాతీతుడినని భావిస్తుంటాడు.. ఇతరుల్ని అల్పులుగా భావిస్తాడు.. మార్క్స్ తర్వాత అంతటి గొప్ప వీర కమ్యూనిస్టుగా గొప్పలు చెప్పుకుంటాడు.. కానీ అణువణువునా బూర్జువా లక్షణాలు, వల్లంతా కుల గజ్జి.. ఒక వామపక్ష పత్రికలో పని చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చాడు. కానీ ఒక్క వాక్యం కూడా సక్రమంగా రాయలేడు. అవసరమైన చోటల్లా కులం కార్డ్ ఉపయోగించుకునే ఈ వీర మార్క్సిస్ట్, తాను పని చేసే ఛానెల్లో నిర్వహించిన చర్చా వేదికలకు ఆహ్వానించే నాయకుల వద్ద చేతివాటం ప్రకటించే సరికి యాజమాన్యం ఇతగాడిని కొంత కాల పక్కన పెట్టింది. పైరవీలకు తోడు, తోటి జర్నలిస్టులకు డబ్బు తీసుకొని ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాడని వినికిడి. అన్ని బీట్లు తనకే కావాలని అత్యాశపడే ఇతగాడితో సదరు ఛానెల్లోనే కాకుండా బయటి జర్నలిస్టులతో కూడా సత్సంబంధాలు లేవు. కులం చలవతో తోటి రిపోర్టర్లపై, కెమెరామెన్లపై యాజమాన్యానికి పితూరీలు చెప్పడం ఇతగాడి హాబీ. తాజాగా ఈ వీర కమ్యూనిస్టు కొత్తగా వస్తున్న ఊరవతలి చానెల్లో బ్యూరో చీఫ్ గా చేరినట్లు వినికిడి. ఇందు కోసం కులం కార్డును బలంగా ఉపయోగించుకున్నడని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇతగాడు అక్కడ చేరాడని తెలిసి ఇతర సీనియర్ జర్నలిస్టులు అక్కడ చేరేందుకు వెనుకాడుతున్నరనేది తాజా వార్త. ఇతగాడిని చేర్చుకునే ముందు సదరు ఛానెల్ ఫీల్డ్ లో విచారించి, రాత పరీక్ష కూడా జరిపి ఉంటే టాలెంట్ ఏపాటిదో తెలిసేది.

Monday, November 3, 2008

స్వకుచ మర్దనం

ఇంద్రుడూ, చంద్రుడూ అంటూ ఇతరులు పొగిడితే పరవాలేదు. కానీ తమని తాము పొగుడుకునే వారిని ఏమనాలి. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు తానే ఆధ్యున్ని అని చెప్పుకునే ఒక వ్యక్తి తన పేరిట ఒక వెబ్ సైట్ ప్రారంభించుకున్నాడు. ( అఫ్ కోర్స్ విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ పేరిట ) అందులో అన్నీ స్వ స్తోత్ర పాఠాలే. అతిశయోక్తులూ ఉన్నాయి. ఆయన గత చరిత్రను దగ్గర నుండి చూసిన వారు ఈయనకు ఇంత సీన్ ఉందా అని గొనుక్కుంటున్నారు. మరీ ఇంత స్వకుచ మర్దనం అవసరమా?..

దిన పత్రికలా?.. కర పత్రలా?..

తెలుగు దిన పత్రికల్లో మునుపెన్నడూ లేని కొత్త సాంప్రదాయం గత కొద్ది నెలలుగా కనిపిస్తోంది. అదే జాకెట్ ఆడ్స్. గతంలో ప్రకటనల విష్యంలో మన దిన పత్రికలు కొన్ని విలువలను, నియంత్రణల్ని పాటించేవి. తొలి పేజీలో ఇయర్ పానల్స్ తో పాటు కుడి వైపు దిగువ ప్రాంతంలో పావు పేజీకి మించి ప్రకటనలు స్వీకరించేవి కాదు (ముఖ్యంగా ఈనాడు). ఆ తర్వాత తొలి పేజీలో అర పేజీ ప్రకటనలు ప్రారంభం అయ్యాయి. అనంతర కాలంలో మార్కెట్ వర్గాల వత్తిడి కారణంగా ఇంటర్నేషనల్ ఫార్మెట్ పేరిట దిన పత్రికల సైజు తగ్గినంది. తొలి పుట నిండా ఒకే ప్రకటన ఇచ్చే ధోరణి మొదలైంది. దీన్నే జాకెట్ యాడ్ అంటున్నారు. మన దేశంలో ఈ సాంప్రదాయానికి బహుషా టైంస్ ఆఫ్ ఇండియా ఈ దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించిందని చెబుతారు. తేరగా డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం మడిగట్టుకు కూర్చుంటారు?. ప్రస్తుతం మరో కొత్త ధోరణి తెలుగు దిన పత్రికల్లో ప్రారంభమైంది. ప్రభుత్వం తొలి పేజీలో బ్యానర్ వార్త స్థానంలో అచ్చం వార్త లాగే ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా ఏది వార్తో, ఏది ప్రకటనో పాఠకులు పోల్చుకోలేక పోతున్నారు. చంద్రబాబో, చిరంజీవో ఒక భారీ సభ పెడితే తొలి పుటలో హెడ్ లైన్ వార్తగా రావడం సహజం. అయితే ప్రభుత్వం పత్రికలకు జాకెట్ ఆడ్స్ ఇవ్వడంతో అసలు వార్తలు పక్కకు పోయి ముఖ్యమంత్రి ఘన కార్యాలు తొలి పేజీలో చోటు చేసుకుంటున్నాయి. జాకెట్ యాడ్స్ వికృతానికి పరాకాష్ట నవంబర్ ఒకటో తేది నాటి తెలుగు దిన పత్రికలు. ఈ దుష్ట సాంప్రదాయానికి అంతం లేదా? ఆదాయం కోసం పత్రికలు ఇంతగా దిగజారటం అవసరమా?