Thursday, October 11, 2007

మళ్ళీ మీడియా వ్యాపారంలోకి దాసరి

శతాధిక చిత్ర దర్శకుడు, విలక్షణ నటుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు ముచ్చటగా మూడోసారి మీడియా వ్యాపారంలోకి వస్తున్నట్లు వినికిడి. 'ఉదయం' దినపత్రికను తిరిగి అరంభించటంతో పాటు 'డి ' పేరిట టీవీ ఛానెల్ తేవడానికి దాసరి సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమి నుండి పనులు ఆరంభమవుతున్నాయి. పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రొడ్యూసర్లతో దాసరి నారాయణ రావు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దాసరి వద్ద ఇప్పటికే 150 చిత్రాల రైట్స్ వున్నాయని వినికిడి. గతంలో ఈనాడుకి ధీటుగా ఉదయం దినపత్రికను తెచ్చి తెలుగు జర్నలిజంలో నూతన వరవడులకు శ్రీకారం చుట్టిన దాసరి పలు కారణాల వల్ల తన పత్రికను మాగుంట సుబ్బరామిరెడ్డికి అప్పగించాల్సి వచ్చింది. అయితే మాగుంట కుటుంబం 'ఉదయం 'ను సక్రమంగా నడపలేక పోవటంతో లాకౌట్ కు గురైంది. దాసరి ప్రారంభించిన 'శివరంజని 'సినీ పత్రిక అత్యధిక సర్క్యులేషన్ సాధించినా అది కూడా మూత పడింది. ఆ తర్వాత దాసరి 'బొబ్బిలిపులి ' పేరిట రాజకీయ వార పత్రికను, 'మేఘసందేశం' సినీ పత్రికను తెచ్చినా అవీ సరిగ్గా నడవక మూత పడ్డాయి. ఈ పత్రిక స్థాపన తరువాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా దాసరి నారాయణ రావు ఎందుకో తన ప్రయత్నాలను విరమించుకొని కాంగ్రెస్లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో బిజీ అయిన దాసరి మీడియా వ్యాపారంలోకి తిరిగి రావడం శుభ పరిణామమే. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడుతున్న దాసరి తన పత్రిక, ఛానెల్ కోసం పలువురు పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటున్నట్లు వినికిడి.