Wednesday, August 29, 2007

అనైతికం అనవచ్చా?..

ప్రజా జీవితంలో ఉన్నవారి వార్తలపై ఎవరికైనా ప్రత్యేక ఆసక్తి ఉండటం సహజం. వారు తుమ్మినా, దగ్గినా వార్తే అంటే అతిశయోక్తి కాదేమో.. ప్రస్తుత చర్చంతా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లొకేశ్, సినీనటుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి వివాహం గురించే. ఈ వివాహానికి మీడియాను పిలవలేదు. అయినా అత్యుత్సాహంతో ఈ వివాహ కవరేజీ కోసం మీడియా అంతా హైటెక్స్ ప్రాంగణానికి వెళ్ళింది. ఆహుతులంతా పెళ్ళి మంటపంలోకి వెళ్ళి, వధూవరుల్ని ఆశీర్వదించి భోజన తాంబూలాలు ఆరగించారు. కాని పిలవని పేరంటానికి వెళ్ళిన మీడియా వారిని పలకరించే నాధుడు లేడు. రోజంతా ఆకలితో మాడారట. ఇక్కడ ఈ విషయం అప్రస్తుతమే అనుకోండి. వివాహ దృశ్యాలను చిత్రీకరించేందుకు మీడియాను అనుమతించలేదు. కానీ టీవీ-9 వాళ్ళు 'తాళి కట్టు శుభవేళ ' అంటూ ఎలాగో పెళ్ళి వీడియో వారిని లోబరచుకొని పెళ్ళి దృశ్యాలను సంపాదించారు. వీటిని 'మాకే ఎక్స్ క్లూజివ్' అంటూ రోజంతా ప్రసారం చేశారు. పనిలో పనిగా రెండు రోజుల ముందు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వేసిన స్టెప్పులను ప్రముఖంగా చూపించారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీవీ-9ది అనైతిక ధోరణి అని తప్పు పట్టారు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ విషాద సమయంలో ఇలాంటి ప్రసారానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. నిజానికి చంద్రబాబు వివాహ కార్యక్రమం ముగియకుండానే బాంబు పేలుడు బాధితులను పరామర్శించడానికి బయలు దేరారు. కాబట్టి ఆయన ఆ మాత్రం బాధను వ్యక్తం చేయటం సహజం. నిజానికి టీవీ-9 చేసిన పని తప్పా అని ప్రశ్నిస్తే అవునని చెప్పలేం.. కాదనీ అనలేం.. విలువల సంగతి పక్కన పెట్టి జర్నలిస్ట్ దృష్టితో ఆలోచించి ఈ విషయాన్ని సమర్ధించుకో వచ్చేమో.. ఎవరి దృష్టి కోణం వారికి ఉంటుంది. అయితే అన్ని విషయాల్లో అతి పనికి రాదు. ఇదే ధోరణి కొనసాగితే.. డయానా విషయంలో బ్రిటన్ టాబ్లాయిడ్లు, పాపరాజీలను జనం ఈసడించుకోవడాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

గొట్టాల కొట్లాట

తెలుగు నాట టీవీ ఛానళ్ళు పెరిగి పోతున్నాయి. దీనికి తగ్గట్లు రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక, చలనచిత్ర కార్యక్రమాల కవరేజీకి వచ్చే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెరిగిపోతున్నారు. ఇక్కడే అసలు సమస్య తయారవుతోంది. మైకులతో బైట్లు తీసుకోవడానికి పోటీ పడుతున్న ఛానెల్ వాలాలు పరస్పరం తోసుకుంటూ, తిట్టుకుంటూ అటు నేతాశ్రీలను, ఇటు ప్రింట్ మీడియా వారిని ఇబ్బంది పెడుతున్నారు. గొట్టలవారితో చచ్చిపోతున్నామండి బాబు అని వీఐపీల సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. 'ఏం చేయమంటారు.. తెరపై మా గొట్టం లోగో కనిపించకపోతే మా బాస్ ఊరుకోరు..' అంటూ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సంజాయిషీ ఇస్తారు. నిజమే పీత కష్టాలు పీతవి.. ఈ ఎపిసోడ్ కి అంతం లేదా?.. కచ్చితంగా ఉంది. మీడియా తాకిడి ఎక్కువగా ఉండే చోటా అన్ని మైకులు పెట్టుకోవడానికి అనువైన స్టాండ్స్ ఏర్పాటు చేయాలి. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ ఏర్పాటు ఇప్పటికే ఉంది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మాత్రమే ఎలాంటి స్టాండ్ కనిపిస్తుంది. అన్నీ I&PR వాళ్ళే ఏర్పాటు చేస్తారు అని భావిస్తే కష్టం. ఛానళ్ళ యాజమాన్యాలే వీటిని స్పాన్సర్ చేస్తే బాగుంటుంది. అవి ఉపయోగ పడేది వారికే అని గ్రహించాలి. గతంలో NDTV ఢిల్లీలో ఇలాగే స్పాన్సర్ చేసింది.
కొత్త పదాలు : గొట్టంగాళ్ళు = ఎలక్ట్రానిక్ మీడియా, పోటుగాళ్ళు = ప్రింట్ మీడియా

Sunday, August 26, 2007

టీవీ-9లో మాధవ్.. అవాక్కయ్యారా?..

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రవిప్రకాశ్ ను అందరికన్నా ఎక్కువగా వ్యతిరేకించే వ్యక్తి మాధవ్. మాధవ్ ఈ శనివారం హఠాత్తుగా రవిప్రకాశ్ ను కలుసుకొని టీవీ-9లో చేరిపోయాడు. ఈ పరిణామంతో చాలా మంది జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. మాధవ్ ఒకప్పుడు రవిప్రకాశ్ కు ఎంతో సన్నిహితుడు. సిటీకేబుల్ కు రవిప్రకాశ్ రాజీనామా చేయగానే అప్పటి దాకా అక్కడే రిపోర్టర్ గా ఉన్న మాధవ్ కూడా ఆయన్నే అనుసరించి జెమినిలో చేరాడు. కాలక్రమంలో కరీం చేరువ కావడం రవిప్రకాశ్ అక్కడక్కడా సూటిపోటి మాటలు అనడం, అవి మాధవ్ కు తెలిసి బాధ పడటం వీరిద్దరితో పరిచయం ఉన్న సన్నిహితులకు బహిరంగ రహస్యమే. నమ్మకంగా పనిచేసే మాధవ్ ను రవిప్రకాశ్ నిర్లక్షం చేశాడని అంతా అనుకుంటుంటారు. రవిప్రకాశ్ జెమినిని వీడి టీవీ-9ని స్థాపించాక మాధవ్ కు కష్టాలు ఆరంభం అయ్యాయి. జెమిని యాజమాన్యం మాధవ్ ను రవిప్రకాశ్ ఏజెంట్ గా అనుమానించటంతో ఆ సంస్ఠకు రిజైన్ చేయక తప్పలేదు. కొంత కాలం జీ-తెలుగులో పనిచేసిన మాధవ్ ను జెమిని యాజమాన్యం మళ్ళీ పిలిపించి కో-ఆర్డినేటర్ జాబ్ ఇచ్చినంది. తిరిగి కొద్ది నెలల్లోనే మాధవ్ యాజమాన్యంతో పడక జెమినికి రాజీనామా ఇచ్చాడు. తాజాగా రవిప్రకాశ్ తో రాజీపడ్డ మాధవ్ ను విజయవాడ కో-ఆర్డినేటర్ గా నియమించారని టీవీ-9 వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి వరకు రవిప్రకాశ్ ని వ్యతిరేకించే జర్నలిస్టులకు అప్రకటిత నాయకుడిగా ఉన్న మాధవ్ తీసుకున్న తాజా నిర్ణయం వారందరిని ఖంగు తినిపించింది. పొట్ట తిప్పల కోసం తనకు నచ్చిని చోట రాజేపడి పని చేసే హక్కు ప్రతి జర్నలిస్టుకు ఉంటుంది.. కాదనలేం. కొత్త జాబ్ లో ఐనా మాధవ్ నిలకడగా పని చేస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే మాధవ్ ఎక్కడ పని చేసినా ఎక్కువ రోజులు ఉండడని ఆయన స్వభావం తిలిసిన రిపోర్టర్లు చెబుతుంటారు. ఎ అమాటకు ఆ మాటే చెప్పలి మాధవ్ చాలా సిన్సియర్ జర్నలిస్ట్..
కొసమెరుపు: మాధవ్ టీవీ-9లో చేరటం వల్ల రవిప్రకాశ్ క్రెడిబిలిటీ పెరిగినట్టే కదా..

Wednesday, August 22, 2007

జెమిని న్యూస్ బ్యురొచీఫ్ కానున్న 'అవినీతి సామ్రట్'


'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారంతా ప్రచారంలో ఉన్న ఒక వార్త విని షాక్ తిన్నారు. ఈ వార్త లేదా వదంతి జెమిని వర్గాలను కూడా కలవర పరుస్తోంది. 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఆ చానెల్లోనే బిజినెస్ రిపోర్టర్ గా పని చేస్తున్న స్టెర్జీ రాజన్ ని నియమించాలని సన్ యాజమాన్యం నిర్ణయించిందట(?) బిజినెస్ రిపోర్టింగ్ ముసుగులో స్టెర్జీ పాల్పడే అవినీతిని మీడియా వర్గాలు కథలు, కథలుగా చెబుకుంటాయి. ఒక్కో వార్తకు ఆయన 2-5 వేల దాకా తీసుకుంటాడు. వార్తా క్లిప్పింగ్లపై వచ్చే ఆదాయం అధనం. ఈ ఆదాయం అంతా ఆయన వ్యక్తిగత, రహస్య ఖాతాలో జమ అవుతుంది. స్టెర్జీ జెమిని నుండి వచ్చే జీతం అంతగా ఖర్చు పెట్టడు. ఈ విషయం ఆయన సాలరీ అకౌంట్ గమనించి నిర్ధారించు కోవచ్చు. బిజినెస్ న్యూస్ ద్వారా జెమిని సంస్థకు దమ్మిడి ఆదాయం ఉండదు. కానీ స్టెర్జీ రాజన్ వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తున్నాయి. జెమిని సంస్థకు ఒక్క యాడ్ రికమెండ్ చేయక పోగా వ్యాపార, కార్పోరేట్ సంస్థలకు జెమినిలో ఉచిత ప్రచారం కల్పిస్తాడీయన (తన జేబుకు గిట్టు బాటైతే చాలు). బిజినెస్ న్యూస్ తో పాటు స్టెర్జీ అధనపు బాధ్యతలు చూస్తున్న సిటిలైట్ ప్రోగ్రాంలో తరచూ ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తుంటారు. బిజినెస్ ప్రెస్ మీట్లకు కూడా కుటుంబ సభ్యులను తీసుకెలతాడని వినికిడి. ఇలాంటి కళాకారున్ని సన్ యాజమాన్యం ఏకంగా 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా నియమిస్తే ఎంత 'ఛీప్'గా ఉంటుందో ఆలోచించండి. దొంగ చేతికి తాలం ఇచ్చినట్లే.. బ్రహ్మాండంగా చానెల్ను మార్కెట్ చేసి పడేస్తాడు (అమ్ముకుంటాడు) కదూ..

సంచలనాలకు కేంద్రం కానున్న ఎన్-టీవీ


తెలుగు నాట నరేంద్ర చౌదరి ఆరంభిస్తున్న ఎన్-టీవీ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఎన్-టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో సరికొత్త ప్రయోగం కానుంది. అత్యున్నత ప్రమాణాలతో వస్తున్న ఈ చానెల్ ఈటీవీ, టీవీ-9లకు గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పవచ్చు. వార్తా సేకరణ కోసం విస్తృతంగా ఓబీ వాన్లను రంగంలోకి దింపుతున్న ఎన్-టీవీ, జిల్లా రిపోర్టర్లకు 'లాప్ టాప్'లను ఇస్తోంది. వీటి ద్వారా స్పాట్ నుండే 3ఎంబి లైన్లో ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని లైవ్ గా ఇస్తారట. ఎన్-టీవీ వేగాన్ని తట్టుకునేందుకు ఈటీవీ, టీవీ-9 ఇదే మార్గంలో వెల్లక తప్పదు. ఆగస్ట్ 30 తేదీన ఎన్-టీవీ, భక్తి టీవీ చానెళ్ళు లాంచ్ అవుతున్నాయి.

Wish you all the best NTV team..

Monday, August 20, 2007

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇక లేనట్లేనా?..


ఇళ్ళ స్థలాల కోసం ఆశగా చూస్తున్న జర్నలిస్టుల ఆశలపై నీరు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసు సాకుతో ప్రభుత్వం ఇన్ని రోజులుగా పెండింగ్ పెడుతూ వచ్చిన ఈ సమస్యను ఇక పట్టించుకోక పోవచ్చు. కేంద్రంలోని పరిణామాలను గమనిస్తే ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. అప్పుడు ఎన్నికల కోడ్ సాకుగా చూపి మరి కొన్ని నెలలు ఇళ్ళ స్థలాల సమస్యను పెండింగ్ పెడతారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయాల్లో, ప్రభుత్వం పాలనా విధుల్లో బిజీగా ఉంటుంది. ఆలోగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడతాయి. ఇక జర్నలిస్టులకు ఇంటి జాగాలు ఇచ్చేదెపుడు? ఏ ప్రభుత్వానికైనా జర్నలిస్టు కరివేపాకు లాంటి వాడే. తెలుగు దేశమైనా, కాంగ్రెసైనా జర్నలిస్టులను అవసరం ఉన్నంత వరకే వాడు కుంటారు. ప్రభుత్వంలో పైరవీలు చేసుకొనే వారికే బినామీగా ఇళ్ళూ, భూములు వచ్చి పడతాయనేది బహిరంగ రహస్యం. వైఎస్ ప్రభుత్వం కొంత నయం కనీసం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఆలోచించింది. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులు ఇంటి జాగాలపై ఆశలు వదులు కోవలసిందే. టిడిపి ప్రభుత్వం మీడియా యాజమాన్యాలకు తప్ప జర్నలిస్టులకు చేసిందేమి లేదు (కొద్ది మందికి మినహా). పత్రికా స్వాతంత్రం అంటే మీడియా యజమానుల వ్యాపారాలకు ఇబ్బంది కలగ రాదేది వారి ఉద్దేశ్యం. వైఎస్ ప్రభుత్వం ఇంకా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వక ముందే ఇచ్చేసినట్లు గవర్నర్ కు ఇచ్చిన ఒక ఫిర్యాదులో టిడిపి ప్రచారం చేసింది.
జర్నలిస్టులూ, నేతలు ఇకనైనా తొందర పడకపోతే ఇంటి జాగాలు ఒక జీవిత కాలం లేటనే వాస్థవాన్ని గ్రహించాలి..