Sunday, October 26, 2008

ఆయన బిజినెస్ మూడు పూవులు.. ఆరు కాయలు..

అనగనగా ఒక న్యూస్ ఛానెల్.. దానికో బిజినెస్ రిపోర్టర్.. ఛానెల్ సంగతి ఎలా ఉన్నా చాలా ఏళ్ళుగా సదరు రిపోర్టర్ ఫీల్డ్ లో హవా నడిపిస్తున్నాడు. ఈయన గారి స్టైలే వేరు . ఈ పొట్టి రిపోర్టర్ వెంట ఒక పొడుగాటి కెమెరామెన్ గన్ మెన్ లా ఎల్లవేళలా కనిపిస్తుంటాడు. బిజినెస్ రిపోర్టింగ్లో సీనియర్ అయిన ఈయన పేరు చెబితే ఈవెంట్ మేనేజర్లకు హడల్ అట. నిజాయితీని చూసి కాదు సుమా.. గిఫ్టులు, డబ్బు కొసం తెగ సతాయిస్తాడట. ఇతగాడు మైక్ పెట్టి బైట్ తీస్కొని పక్కకు వెళ్ళగానే లంబు కెమెరామెన్ అయ్యగారి పేరు చెప్పి ఎంతో కొంత లాగుతాడట. పొట్టాయన-పొడుగాయన ప్రెస్ మీట్లకు పోయారంటే అక్కడ ఉండే చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళ దగ్గర నుంచీ అంతా ఊడ్చుకు వచ్చేస్తారట. సదరు బిజినెస్ రిపోర్టర్ ప్రెస్ మీట్లకు తన కుటుంబ సభ్యులను కూడా తరచూ తీసుకెళతాడట. వారికి గిఫ్టులు అదనం అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా. ఈ సీనియర్ బిజినెస్ రిపోర్టర్ జీతం తక్కువే అయినా గీతం ఎంతలేదన్నా రోజుకి రూ.10,000/- పై మాటే అని తోటి బిజినెస్ రిపోర్టర్లు అంటున్నారు. అందుకే మన వాడు ఇతర చానెళ్ళకు వెళ్ళకుండా అక్కడే కొనసాగుతున్నాడట. నగరంలో జరిగే స్పెషల్ ఈవెంట్లు, న్యూ ఇయర్ పార్టీలకు వచ్చే కాంప్లిమెంటరీ పాసులను సైతం సదరు లంబు కెమెరామెన్ తో అమ్మించి సొమ్ము చేసుకుంటాడట. బిజినెస్ తో పాటు సిటీ ఈవెంట్స్ ప్రోగ్రాంకి కూడా ఇతడే ఇంచార్జ్. ఈయన ఏది ఇచ్చినా సదరు చానెల్లో ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రసారం అవుతాయి. తన బంధు మిత్రుల ఫంక్షన్లను సైతం ఏదో ఒక రూపంలో ప్రసారం చేసుకుంతాడు. అడిగే దైర్యం ఎవరికీ లేదు. సదరు చానెల్ పెద్దల ఐటీ వ్యవహారాలను చక్కపెడతాడు కాబట్టే ఇంత హవా అట. దీపావళి, న్యూ ఇయర్ వచ్చాయంటే మనోడికి గిఫ్టులే గిఫ్టులు. గత సంవత్సరం సదరు చానెల్ ఆఫీసుకు భారీగా వచ్చిన స్వీట్లు, డ్రైఫ్రూట్ బాక్సులు, కానుకల్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆటో ట్రాలీ మాట్లాడుకున్నాడని అక్కడి డ్రైవర్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ దీపావళికి?.. ఈ రిపోర్టర్, కెమెరామెన్ తమకు వచ్చే గిఫ్ట్లులను సదరు చానెల్ ఆఫీసు సమీపంలోని బత్తాయి బండివాడి దగ్గర దాచుకుంటారట. మార్కెట్ సెన్సెక్స్ సూచీ రోజు రోజుకీ పడిపోతుంటే, మనోడి ఆదాయ సూచీ దిన దిన ప్రవర్తమానంగా పైకి పోతోందిట.

Thursday, October 23, 2008

మీడియా గురవిందలు

సమాజానికి నీతులు చెప్పే జర్నలిస్టులు తమ నగ్న స్వరూపాలను నిసిగ్గుగా చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చోటు చేసుకుంటున్న ఈ పెడ ధోరణులు జర్నలిస్ట్ ప్రపంచానికే తలవంపులు కలిస్తున్నాయి. ఇటీవల ఒక ఛానెల్లో పని చేస్తున్న జర్నలిస్ట్ పైన అతని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇతగాడి అనైతిక సంబంధాలు, మతం ముసుగులో చేసే అరాచకాల కారణంగా ఒక్క జర్నలిస్ట్ కూడా అతనిపై సానుభూతి చూపించలేదు. ఇలాంటి అసహ్యమైన జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడే నైతిక బాధ్యత వల్ల మేము వారి పేర్లు వేడించడంలేదు. కానీ వారి లీలలు ఆలకించండి..
ఇటీవల దాడికి గురైన జర్నలిస్ట్ ఛానెల్లోనే పని చేసే మరో సీనియర్ జర్నలిస్టుదీ ఇదే కథ. ఇతగాడు కట్టుకున్న భార్యను వంచించి ఒక అగ్ర సినీ దర్శకుని కార్యాలయంలో పని చేసే మహిళను పెళ్ళాడాడు(?) సదరు పుణ్య పురుషుడు గతంలో తాను పని చేసిన చానెల్ నుండి బోగస్ సర్టిఫికెట్ సృష్టించి తన ప్రియురాలికి ఇంటి జాగా కోసం దరఖాస్తు చేయించి పట్టు బడ్డాడు.
కర్మగా పేరొందిన ఒక శాడిస్ట్ జర్నలిస్టు రెండో ఇల్లు నడుపుతూ ధర్మపత్నికి అన్యాయం చేస్తున్నాడు. ఈ నెం.2 కూడా ఇతగాడి శాడిజాన్ని భరించలేక పోతోందిట.
ప్రతిక్షణం .. అంటూ వార్తల కోసం తహ తహ లాడే ఒక ఛానెల్లో పని చేసే ప్రబుద్దుడు తోటి (వివాహిత) మహిళా జర్నలిస్టుతో పెళ్ళి చేసుకోకుండానే కాపురం పెట్టాడు. వీరిద్దరూ గతంలో ప్రముఖ ఛానెల్లో కలిసి పని చేసిన వారేనట. ఈ ప్రబుద్దుడు సదరు మహిళా జర్నలిస్టుకు ఒక ఫ్లాట్ కూడా కొని పెట్టాడట.
టీవీ/పత్రిక నడిపే జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ పై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు తానే ఆధ్యున్నని చెప్పుకొనే ఓ ప్రముఖునిపై కూడా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి.
గురవింద జర్నలిస్టులారా(ముఖ్యంగా ఎలక్ట్రానిక్).. సమాజానికి నీతులు చేప్పే ముందు మీ కింద ఒకసారి చూసుకోండి.

Sunday, October 12, 2008

ఓ యాంకర్ రాజీనామా..

క్రిమినల్ ఔట్ సోర్సింగ్ కింద నడిచే న్యూస్ ఛానెల్లో పని చేయనని ప్రకటించి ఒక యాంకర్ రాజీనామా చేసింది. తమిళ యాజమాన్యం కింద నడిచే సదరు ఛానెల్ సిబ్బంది తీవ్ర ఆందోళన పడుతున్నారు. తమ ఉద్యోగాల విషయంలో స్థానిక యాజమాన్యం పెదవి విప్పక పోవడంతో రాజీనామాలకు సిద్దం అవుతున్నారు. ఔత్ సోర్సింగ్ అనేది గాలి వార్తే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ తీసుకుంటున్న ఆ ప్రముఖుడు కీలక ఉద్యోగాలను తన అనుచరులతో నింపేయడంతో తమ పరిస్థితి ఏమిటని సీనియర్లు ఆవేదనలో పడ్డారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న రిపోర్టర్ల స్థానంలో తమ వారిని భర్తీ చేసే ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ ఔట్ సోర్సింగ్ తతంగంలో చెన్నై చినబాబు, మూత పడ్డ బ్యాటరీ కంపనీ యజమాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

బాధ్యత లేని ఛానెళ్ళు

సమాజ సంక్షేమంపై తమకే గుత్తాధిపత్యం ఉన్నట్లు గొప్పలు చెప్పుకునే కొన్ని ఛానెళ్ళు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ ఏవగింపు కలిగిస్తున్నాయి. వ్యవస్థలు కుప్పకూలేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రేటింగుల్లో అగ్రస్థానం కోసం నీచానికి దిగజారుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవాస్థవాలను ప్రసారం చేస్తున్నాయి. ఇక్కడ ఆ ఛానెళ్ళ పేర్లను మేం ప్రస్థావించడం లేదు. అయినా కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాం. వారెవరో మీకే అర్థం అవుతుంది.
ఇటీవల ప్రముఖ బ్యాంక్ కష్టాల్లో ఉన్నట్లు వచ్చిన నిరాధార వార్త ఖాతాదారుల్ని భయ పెట్టింది. ఆ బ్యాంక్ ఏటీఎంల ముందు పెద్ద సంఖ్యలో ఖాతా దారులు బారులు తీరడంతో నిమిషాల్లో డబ్బు ఖాళీ అయింది. ప్రజలు దాడులు జరిపి బ్యాంక్ ఆస్థులకు నష్టం కలిగించారు.

ఎక్కడో బర్డ్ ఫ్లూ వస్తే దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆపాదించడంతో ఫౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలింది. ఆ తర్వాత ముడుపులు తీసుకొని పాజిటివ్ వార్తలు ఇచ్చారట.

ఒంగోలులో ఒక వ్యక్తి కలేక్టరేట్లో విషం తాగి ఆత్మ హత్య చేసుకుంటుంటే అతడు చచ్చే దాక చిత్రీకరించిన ఛానెళ్ళ ప్రతినిధులు కనీసం ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు.

ఒక మాజీ శాసన సభ్యుడు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కునుకు తీస్తే అతడు మరణించాడనే వార్త ప్రసారం చేసి ఖంగారు పెట్టారు.

వ్యక్తిగత విషయాలను కూడా సంచలన వార్తలుగా ప్రసారం చేస్తున్న కొన్ని ఛానెళ్ళు మున్ముందు శోభనాల్నీ వదవలవేమో. ఇలాంటి వార్తకు ఆగ్రహించిన ఒక సినీ నటుడు ఓ ఛానెల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి ఉన్నత ఉద్యోగిని ఒక్కటి పీకి వచ్చాడట.

భార్య కూరలో ఉప్పు ఎక్కువేసిందని అలిగి టవరెక్కే వెధవాయిలకు కూడ లైవ్ కవరేజి ఇచ్చే రోజులు రాబోతున్నాయి.

Wednesday, October 1, 2008

క్రిమినల్ చేతిలో న్యూస్ ఛానెల్

ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వక పోవడంతో తమిళ యాజమాన్యం కింద పని చేస్తున్న ఒక తెలుగు ఛానెల్ దాదాపుగా ఖాళీ అయింది. అత్తెసరు జీతాలతో ఆ ఛానెల్ లో పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. పని నేర్చుకొని మరేదైనా ఛానెళ్ళో జాబ్ చూస్కోవచ్చనే ఆశతో కొత్తగా ఎవరైనా ఉద్యోగంలో చేరడానికి వస్తే కొద్ది నెలలు జీతం ఇవ్వకుండానే ఊడిగం చేయించుకోవడం, ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వారిని గెంటివేయించడంలో ఆ ఛానెల్ వారు నిశ్నాతులు. తప్పు ఎక్కడుందో తెలుసుకొని సరి దిద్దు కోవాల్సిన ఆ ఛానెల్ యాజమాన్యం చేతులెత్తేసి తమ వైఫల్యాన్ని అంగీకరించేసింది. న్యూస్ నిర్వహణ తమకు చేత కాదని తెలుసుకున్న యాజమాన్యం ఔట్-సోర్సింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏకంగా ఛానెల్ ను ఒక క్రిమినల్, బ్లాక్ మెయిలర్ చేతిలో పెట్టారు. ఇతగాడు గతంలో ఎంతో మందిని ముంచాడు. ఒక క్రైం మాగజైన్, ఛానెల్లలో క్రైం ప్రొగ్రాంలు నిర్వహించడమే ఇతగాడి అర్హత. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే ఈ వ్యక్తి ఒక కిడ్నాప్ కేసులో కూడా ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ప్రెస్ క్లబ్లో తోటి జర్నలిస్టుల చేతిలో చావు దెబ్బలు తిన్న చరిత్ర కూడా ఉంది. ప్రైవేట్ గన్ మెన్లతో తిరిగే ఇతగాడిని చూసి ఆ ఛానెల్ సిబ్బంది జడుసు కుంటున్నారు. న్యూస్ ను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వడంతో ప్రస్తుత సిబ్బంది భవిష్యత్తు అంధకారంలో మునిగి పోయింది. ఇతగాడు క్రమంగా తన సిబ్బందిని రంగంలో దింపుతున్నాడు. వీరికి, పాత సిబ్బందికి జీతాలు ఎవరు ఇస్తారు?.. అరవ యాజమాన్యమా?.. ఇతగాడా?.. న్యూస్ నిర్వహణకు గాను ఇతగాడే ఛానెల్ యాజమాన్యానికి ఎదురివ్వాలని ఒప్పందం కుదరడంతో వసూల్ రాజాలను రంగంలోకి దింపే అవకాషం ఉంది. డబ్బులు తీసుకొని వార్తలు ఇవ్వడంలో, వార్త రాస్తానని బెదిరించి వసూలు చేయడంలో ఇతగాడు ఘనాపాటి. ఫ్రాడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న సదరు ఛానెల్నుఇక ఆ దేవుడే రక్షించాలి.

ఈ ఛానెళ్ళు ఎంత కాలం ఉంటాయి?

తెలుగులో వినోద, న్యూస్ ఛానెళ్ళు పుట్ట గొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. ఈటీవీ, ఈటీవి-2, టీవీ-9, ఎన్-టీవీ, టీవీ-5, జెమిని, జెమిని న్యూస్, తేజా, డీడీ, మాటీవీ లకు తోడు త్వరలో సాక్షి, సితార, హెచ్.ఎం .టీవీ, హై టీవీ, జీ 24 గంటలు, ఇ-న్యూస్, ఎన్ స్టూడియో, లోకల్ టీవీ, ఆర్ టీవీ..(ఈ జాబితాకు అంతం లేదు, ఇందులో భక్తి, కామెడి, మ్యూజిక్ చానెళ్ళను మినహాయించం) ఛానళ్ళు రావడంతో జర్నలిస్టులకు గిరాకీ పెరిగి వేల కొలది రూపాయల జీతాలు దొరుకు తున్నాయి. ప్రస్తుతానికి అంతా హాపీయే.. కాని భవిష్యత్తు గురించి ఎవరూ అలోవించడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఒకటి రెండు ఛానళ్ళే నిలుస్తాయని మీడియా ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఛానెల్ ప్రారంభించేందుకు అవసరమైన టెక్నాలజీ ఖర్చు తగ్గడంతో సౌండ్ పార్టీలన్నీ తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనం కోసం పోటా పోటీగా గోదాలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో కనిపిస్తున్న గడ్డు పరిస్తితే రేపు మీడియాకూ రాక తప్పని పరిస్తితులు కనిపిస్తున్నాయి. తగిన మార్కెట్ లేక, జీతాల బిల్లులు భారమై కొన్ని ఛానెళ్ళు మూత పడక తప్పని పరిస్తితి కనిపిస్తోంది. చివరికి మిగిలేదెవరో, మునిగేదెవరో చెప్పడం కష్టమే. ఎన్నికలు అయ్యేంత వరకైతే ఎవరికీ డోకా లేదు ఆ తర్వాత జర్నలిస్టులు ఎవరి దారి వారు చూసుకోవటానికి ఎప్పటి నుండే జాగ్రత్త పడటం అవసరం.