Sunday, December 30, 2007

దొంగ జర్నలిస్టులున్నారు జాగ్రత్త..

ఛానెళ్ళు, పత్రికలు పెరిగి పోయాక వార్తా సేకరణ కోసం తిరిగే రిపోర్టరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. సమావేశాలు, ప్రెస్ మీట్లకు వచ్చే రిపోర్టర్ల సంఖ్య గతంలో కన్నా బాగా పెరిగి పోయింది. ఎవరు ఏ పత్రికలో, ఏ ఛానెళ్ళో పని పని చేస్తున్నారో అర్థం కాని గందరగోళ పరిస్థితి. కార్యక్రమ నిర్వాహకులు 'మీరు ఏ మీడియా? అని అడిగితే ఏం ఇబ్బందో అని అడగని ఇబ్బందికర పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకొని బోగస్ రిపోర్టర్లు బయలు దేరారు. దర్జాగా వచ్చేస్తున్నారు. ఏదో ఒక పత్రిక పేరో, ఛానెల్ పేరో చెప్పేస్తున్నారు. నిర్వాహకులు పెట్టే టిఫిన్లు, టీ-కాఫీలు, భోజన తాంబూలాదులు లాగించేస్తున్నారు. ఇచ్చే గిఫ్టులు పుచ్చుకొని చెక్కేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాన భోజన పథకం అమలులో ఉన్న తెలుగుదేశం పార్టీ బీట్లో ఈ బోగస్ జర్నలిస్టులు ఎక్కువ కనిపిస్తుంటారు. బోగస్ జర్నలిస్టుల తాకిడిని తట్టుకోవడానికి బిజినెస్ ప్రెస్ మీట్లు నిర్వహించే ఈవెంట్ మేనేజర్లు తెలివైన ఎత్తుగడ వేస్తున్నారట. తమకు అవసరమైన రిపోర్టర్లనే గుర్తించి వ్యక్తిగతంగా కలుసుకొని గిఫ్టులు, కవర్లు అందజేస్తున్నారట. ఈ పద్దతేదో బాగుంది కదూ? బోగస్ రిపోర్టర్లను అరికట్టాల్సిన బాధ్యత నిజమైన జర్నలిస్టులందరిది? లేకపోతే మీకూ ఇబ్బందులు తప్పవు.

టిటివి వచ్చేస్తోంది..

తెలుగులో మరో కొత్త ఛానెల్ ' టిటివి ' త్వరలో రాబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం ' టిటివి 'కి సీఇవో-కం-ఎడిటర్ గా కె.రామచంద్ర మూర్తి పేరు వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే ఆంధ్రజ్యోతికి రాజీనామా ఇచ్చారని తెలుస్తోంది. ఇక టిటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పోస్టుకి ప్రస్తుతం ఖాళీగా ఉన్న భావనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ' టిటివి ' అంటే ఏమిటి? తెలుగు టీవీయా? తెలంగాణా టీవీయా? లేక 'ట్రూత్ టీవీ'యా అన్నది స్పష్టం కాలేదు. ప్రముఖ ఫర్టిలైజర్ కంపనీ ఈ ఛానెల్ పెడుతోందిట..

Tuesday, December 25, 2007

ధనార్జనా నీదే ఛానెల్?

చందూ జనార్ధన్ మరో కొత్త కొలువు సంపాదించాడు. ఇప్పుడాయన విస్సా ఛానెల్లో చేరిపోయాడు. ధనార్జనుడిగా అపఖ్యాతి తెచ్చుకున్న ఇతడి ఘన చరిత్రను మీడియా వర్గాలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నాయి. గతంలో జనార్ధనుడి లీలను ఎబౌట్ తెలుగు మీడియా చాటి చెప్పినా కుక్క తోక వంకర అన్నట్లు అతడి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. రాయడం చేత కాకున్నా జర్నలిస్టు ఫోజు కొట్టడం జనార్ధనుడికే చెల్లు. ఎర్రం నాయుడు రికమండేషన్ తో ' సీ-ఛానెల్ ' జనార్ధన్ ను నమ్మి బ్యూరోచీఫ్ ఉద్యోగం ఇస్తే పైరవీలు చేసుకుంటూ నెలల తరబడి అఫీసుకెల్లకుండా నరసిం హా రావు అనే నమ్మిన బంటుతో ఫోన్లపైనే మేనేజ్ చేశాడు. చివరకు సంస్థకే ఎసరు పెట్టబోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నటికీ వచ్చే అవకాశం లేని సత్యా టీవీ పేరు చెప్పుకొని తిరిగాడు. అక్కడి నుండి అప్పటి చెన్నై జెమిని న్యూస్ ఎడిటర్కి ముడుపులు సమర్పించుకొని ఢిల్లీ రిపోర్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. కానీ ఢిల్లీ నుండి ఏనాడు సరిగ్గా వార్తలు పంపకుండా పైరవీలకే పరిమితం అయ్యాడు. ఆ మధ్య పది రోజులు సెలవు పెట్టి జెమినికి రిజైన్ చేయకుండానే ఆంధ్రప్రభ హైదరాబాద్ బ్యూరోచీఫ్ ఉద్యోగం సంపాదించాదు. ఇందు కోసం కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పైరవీ చేయించుకున్నాడు. కానీ వారం రోజులు తిరక్కుండానే ఢిల్లి జెమిని ఉద్యోగంలో చేరిపోయాడు. ఈ వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆంధ్ర ప్రభ ఏడిటర్ ఒక ఆర్టికల్ రాయమని జనార్ధన్ కు చెప్పారు. జనార్ధన్ ఆ పని చేయలేదు. అసలాయనకు రాయటం వస్తే కదా?.. జనార్ధన్ను ఎడిటర్ గారు మందలించే సరికి చెప్పా పెట్టకుండా ప్రభ ఆఫీస్ వది వచ్చాడు. తిరిగి ఢిల్లీ చేరిన జనార్ధన్ కు సతీష్ బాబు జెమిని ఛీఫ్ ఎడిటర్ కావడం పిడుగు లాంటి వార్త అయింది. జెమినిలో ఆటలు సాగవని అర్థమైన జనార్ధన్ సైలెంట్ గా 'విస్సా'లో చేరిపోయాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనార్ధన్ ఇంకా జెమినికి రాజీనామా ఇవ్వలేదట. జెమిని వారు ఇంత గుడ్డిగా ఎలా ఉన్నారు?.. అసలు జనార్ధన్ లాంటి అవినీతి పరునికి విస్సా న్యూస్ టీం ఎలా ఉద్యోగం ఇచ్చింది?.. అసలు సాంకేతికంగా జనార్ధన్ జెమినిలో ఉన్నట్లా?.. విస్సాలో ఉన్నట్లా?.. ఇంతకీ నీదే ఛానెల్ ధనార్జనా?.. అసలు జనార్ధన్ లాంటి వ్యక్తికి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం, హౌసింగ్ సొసైటీ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తాయి?..

Sunday, December 23, 2007

ప్లాట్ల కోసం జర్నలిస్టుల పాట్లు

రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఖాయమని స్పష్టం కావడంతో మీడియా వర్గాల్లో ఎక్కడలేని హడావుడి మొదలైంది. ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారుగా విడివిడిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్థుతం వున్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (జూబ్లీహిల్స్), ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ, కెమెరామెన్స్, ఫొటోగ్రాఫర్స్ సొసైటీలకు తోడుగా ' గ్రూప్ ' పేరిట ఇళ్ళ స్థలాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ' గ్రూప్ ' ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీపై ఎన్నో ఆరోపనలు కేసులు ఉండటం వల్ల, అందులో ఉంటే లేనిపోని చిక్కులు ఉంటాయని, ప్లాట్లు వచ్చే అవకాశం లేదని భావించిన వారు గ్రూప్ పేరిట ఇళ్ళ స్థలాల ప్రయత్నం మొదలు పెట్టారు. అమర్ మద్దతుతో ప్రారంభమైన ఈ గ్రూప్ కి ప్రభుత్వంలోని పెద్దల సహకారం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది. గతంలో జూబ్లీహిల్స్ సొసైటీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సబ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడం వల్లే వారు ప్రత్యేక సొసైటీ పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొందరు జర్నలిస్టులకు జూబ్లీహిల్స్ సొసైటీలో సభ్యత్వం ఉంది. ఈ ద్వంద్వ సభ్యత్వ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని వారు భయపడుతున్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా సొసైటీ అయినా అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఎందరో సీనియర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపించిన జూబ్లీహిల్స్ సొసైటీలో గతంలొ పత్రికాఫీసుల్లో పని చేసే లిఫ్ట్ బాయ్లు, ఆఫీస్ బాయ్లు, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలకు సభ్యత్వం లభించడమే కాదు ఇళ్ళ స్థలాల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏర్పడ్డ ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో కూడా నిబంధనలకు విరుద్దంగా ఆంకర్లకు, ప్రొడ్యూసర్లకు, టెక్నికల్ సిబ్బందికి బోగస్ సర్టిఫికెట్ల ద్వారా సభ్యత్వం లభించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో, అందునా హైదరాబాద్లో మూడేళ్ళు పనిచేసి ఉండాలనే నిభందన వల్ల చాలా మొంది తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి సభ్యత్వానికి అర్హత పొందారు. వీరి కారణంగా నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
కొసమెరుపు: రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గనక దయతలిచి ఇళ్ళ స్థలాలు ఇస్తే చాలా మంది జర్నలిస్టులు వాటిని అమ్ముకొని కోటీశ్వరులైపోయి, పాత్రికేయ వృత్తికి గుడ్బై చెబుదామనుకుంటున్నారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొంది ఖరీదైన జీవితం అనుభవిస్తున్న జర్నలిస్ట్ మిత్రులే వారికి స్పూర్తి. అఫ్ కోర్స్ గతంలో ఇళ్ళ స్థలాలు పొంది వెంటనే అమ్ముకొని, తీరా వాటికి ధర పెరగటం చూసి నష్టపోయాం బాబో అని లబో దిబో అంటున్న జర్నలిస్టులు కూడా ఉన్నారనుకోండి.

Thursday, December 13, 2007

టీవీ-5 శవాల వ్యాపారం

తెహల్కా వాళ్ళు ఒకసారి స్టింగ్ ఆపరేషన్ల కోసం వ్యభిచారిణులను వాడుకోవడంపై పెద్ద రచ్చ జరగటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీవీ-5 ఛానెల్ అంతకన్నా నీఛానికి ఒడిగట్టింది. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలను అమ్ముతున్నారని నిరూపించేందుకు టీవీ-5 వారు ఏకంగా శవాలను కొన్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. శవాను కొన్నాక ఏమి చేసుకోవాలో తెలియక అక్కడే వదిలి వెళ్ళారు. మార్చురీ సిబ్బంది కంగారులో మూసీలోకి తోయడం, మరునాడు రచ్చ జరిగి పోవడం అందరికీ తెలిసిన విషయాలే. సంచలన వార్తల కోసం ఇంత కక్కుర్తి పడటం సరైన పనేనా? టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంత అసహ్యమైన పనులకు దిగజారడం అవసరమా. వీరికన్నా వయభిచారిణులే నయం. వారు పొట్ట కూటికే వ్యభిచరిస్తారు తప్ప సమాజానికి అంతగా హాని చేయరు.
కొసమెరుపు: శవాల వ్యాపారం స్థాయికి దిగజారిన టీవీ-5పై పోఅలీస్ కేస్ నమోదై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు టీవీ-5 వారు మీడియా స్వేచ్చ అంటూ సిగ్గు లేకుండా జర్నలిస్ట్ సంఘాల మద్దతు కోరుతున్నారు.

మహిళా జర్నలిస్టులకు చోటు లేదా?

అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్ళుతున్న మహిళలకు మీడియాలో తగిన స్థానం లభించక పోవడం ఏమిటి? మహిళా సాధికారితపై, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పుంకాను పుంకాలుగా వార్తా కథనాలు ఇస్తున్న మీడియా యాజమాన్యాలు చేస్తున్నదేమిటి? ప్రింట్ మీడియాలో ఉన్న కొద్ది మంది మహిళలు కూడా డెస్క్ వరకే పరిమితం అవుతున్నారు. రిపోర్టింగ్లో వారికి అవకాశాలు అంతంత మాత్రమే లభిస్తున్నాయి. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రమే మహిళా జర్నలిస్టుల సంఖ్య అంతో ఇంతో కనిపిస్తుంది. టీవీ-9లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే మహిలా రిపోర్టర్లు ఉన్నారు. ఈటీవీ, ఎన్-టీవీ, టీవీ-5లలో కొద్ది మంది కనిపిస్తుంటారు. కాని జెమిని, మాటీవీ ఛానెళ్ళలొ అసలు మహిళా రిపోర్టర్లే కనిపించరు. ఏం మహిళలు రిపోర్టింగ్లో పనికిరారని ఈ ఛానెళ్ళ ఉద్దేశ్యమా?

Sunday, December 9, 2007

ఆంధ్రభూమి దినపత్రిక 09-12-2007 / 10-12-2007




మీడియా ' చిరు ' భజన

చిరంజీవి రాజకీయ ప్రవేశ వార్తలపై రాష్ట్రమంతా ఉత్కంఠత నేలకొంది. ఈ వార్త విషయంలో మీడియా పడుతున్నా పోటీ అంతా ఇంతా కాదు. చిరంజీవి రాజకీయాలకు రావాలా? వద్దా? వస్తే ప్రజాదరణ ఎలా ఉంటుంది? పార్టీ పెడితే ఎవరికి నష్టం? అనే అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పోటీలు పడి వార్తలు ఇస్తున్నాయి. సర్వేలు చేస్తున్నాయి. ఇదే అవకాశంగా మీడియాలో వీలైనంత ప్రచారం పొందేందుకు చిరు రాజకీయ ప్రవేశంపై రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, అభిమాన సంఘాలు తమ వంతుగా ప్రకటణలు చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే 1982లో ఎన్.టీ.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఈనాడు ఇచ్చిన పబ్లిసిటీ గుర్తుకు వస్తోంది. తేడా ఒక్కటే.. అనాడు రామారావుకు ఈనాడు ఒక్కటే ఉంటే, ఈరోజున ఎన్నో పత్రికలు, ఛానెళ్ళు ' చిరు 'కి తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఎన్.టీ.ఆర్. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈనాడుతో పాటు అన్ని పత్రికల సర్క్యులేషన్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అందుకే చిరంజీవికి ఉన్న ప్రజాభిమానాన్ని మీడియా పోటీలు పడి సొమ్ము చేసుకో ప్రయత్నిస్తోంది. wish you all the best CHIRU..

ఆంధ్రభూమి దినపత్రిక 08-12-2007 నుండి


అమ్మకానికి ఛానెళ్ళు

మీరో న్యూస్ ఛానెల్ పెట్టాలనుకుంటున్నారా.. ఒక్కసారి ఆలోచించండి.. ఇది గిట్టుబాటు వ్యాపారమేనా అని. ఇటీవలే ప్రారంభమైన రెండు ఛానెళ్ళు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. భారీ పెట్టుబడులతో, అట్టహాసపు జీతాలతో ప్రారంభించిన ఈ ఛానెళ్ళు ఎంతగా పోటీపడి నడిపిస్తున్నా ప్రేక్షకాదరణ అంతగా లేక, ప్రకటణలు రాక యజమానులకు చేతి చమురు వదులుతోందిట. యజమానుల చివాట్లు, వత్తిడులు భరించలేక జర్నలిస్టులు కూడా ఉద్యోగాలు వదులుకుంటున్నారు. మరోవైపు ఈ ఛానెళ్ళలో పెట్టుబడులు పెట్టిన పెద్ద తలకాయలు ఇదేమి గిట్టుబాటు వ్యవహారం కాదని వాటాలు తీసేసుకోవడానికి ప్రయత్నిసున్నారు. ఈ పరిస్థితుల్లోంచి గట్టెక్కాలంటే ఛానెళ్ళను అమ్ముకోవడమే మంచిదని యజమానులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక ఛానెల్ని కొనుగోలు చేసేందుకు బీజేపీ జాతీయ అగ్రనేత ఒకరు బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తెలుగులో ఇన్ని 24 గంటల వార్తా ఛానెళ్ళు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి.. అసలీ ఛానెళ్ళు ఎందుకు నడుపుతున్నారు.. ఎవరు చూస్తున్నారు.. ఫీల్డులో వార్తలకోసం, స్క్రోలింగులు, ఫ్లాషులు, లైవులు, పీటూసీల కోసం జర్నలిస్టు సోదరులంతా ఎందుకింత పోటీలు పడుతున్నారు.. అఫ్కోర్స్ మన ఉద్యోగ ధర్మం నెరవేరుస్తున్నాం అనుకోండి.. న్యూస్ ఛానెళ్ళ రేటింగులే తక్కువ.. పైగా కొద్ది మార్కెట్ మెతుకుల కోసం ఎందుకింత హైరానా?..